వీరప్పన్‌ను మజ్జిగతో చంపడం నిజం కాదా..?

veerappan

ఎర్రచందనం స్మగ్లర్‌ వీరప్పన్ జీవిత విశేషాలతో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తీసిన సినిమా అవాస్తవాలతో కూడుకున్నదని వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ఆరోపించారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ‘కిల్లింగ్‌ వీరప్పన్’ చిత్రాన్ని ‘విల్లాది విల్లన్ వీరప్పన్’ పేరుతో శుక్రవారం తమిళంలో విడుదల చేశారు. ఈ సినిమా వీక్షించిన అనంతరం ముత్తులక్ష్మి చెన్నై ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ ‘విల్లాది విల్లన్ వీరప్పన్’ పేరుతో తమిళనాట విడుదలైన రామ్‌గోపాల్‌వర్మ సినిమా అంతటా అవాస్తవ సంఘటనలే ఉన్నాయని, ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్‌తో సంబంధాలు ఉన్నట్టు చూపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త వీరప్పన్ పేరును ఉపయోగించుకుని సంపాదనే ధ్యేయంగా సినిమాలు తీస్తున్నారని, రామ్‌గోపాల్‌వర్మ తీసిన సినిమాను ఎవరూ చూడవద్దని విజ్ఞప్తి చేశారు. తన భర్త వీరప్పన్‌ను పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన మాజీ పోలీసు అధికారి దేవారానికి తెలిసిన వివరాలతో పుస్తకం రాసి ఉంటే బాగుంటుందని, ప్రస్తుతం కేంద్ర సర్వీసులో ఉన్న ఐపీఎస్‌ అధికారి విజయకుమార్‌కు తన భర్త గురించి ఏమీ తెలియదని, తన భర్తను మజ్జిగలో విషమిచ్చి మట్టుబెట్టిన ఆయన పుస్తకం రాయడమేమిటని ముత్తులక్ష్మి ప్రశ్నించారు. తన భర్తను విషమిచ్చి చంపిన నిజాన్ని విజయకుమార్‌ వెల్లడించేందుకు సిద్ధమేనా అని ఆమె సవాల్‌ విసిరారు. ప్రస్తుతం సమాజంలో ఘరానా పెద్ద మనుషులు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలతో పోల్చుకుంటే తన భర్త వీరప్పన్ చేసిన నేరాలు స్వల్పమేనని ఆమె అన్నారు. వీరప్పన్ యేళ్ల తరబడి అడవుల్లో అజ్ఞాతవాసంలో గడపటానికి గల వాస్తవమైన కారణాలు త్వరలో వెల్లడవుతాయని చెప్పారు. తొలినాళ్ళలో వీరప్పన్ చందనపు దుంగలను స్మగ్లింగ్‌ చేస్తున్నప్పుడు తాను ఆయన వెంటనే ఉన్నానని, ఆయనకు ఎల్టీటీఈ నేత ప్రభాకరన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని ముత్తులక్ష్మి స్పష్టం చేశారు.